ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం

11 May, 2018 07:21 IST|Sakshi

ఇది మా ప్రభుత్వం.. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులు

సాక్షి, కోడుమూరు : కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ నెల మూడో తేదీన జరిగిన ఈ ఘటన గురువారం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది. పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామ టీడీపీ ప్రధాన నేత అయ్యప్ప సోదరుడి కుమారుడు సుంకన్న ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని అన్నం పెడతానంటూ ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. రక్తంతో తడిచి ఉన్న బాలిక దుస్తులను గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు సుంకన్నను నిలదీశారు. ‘ఇది మా ప్రభుత్వం. మేమేం చేస్తే అది జరుగుతుంది. జరిగిన విషయాన్ని ఎవ్వరికైనా చెబితే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీంతో వారు చిన్నారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే.. గురువారం బంధువుల సహకారంతో కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

మరిన్ని వార్తలు