ఆ రూ.27 కోట్ల వివరాలివ్వండి.. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు

14 Nov, 2023 15:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్‌లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ మేరకు టీడీపీ జనరల్‌ సెక్రటరీతో పాటు ట్రెజరర్‌ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం.  పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది.

ఇదిలా ఉంటే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా.  అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. 

మరిన్ని వార్తలు