భర్తపై భార్య హత్యాయత్నం 

12 Aug, 2019 12:35 IST|Sakshi

ప్రియుడితో కలిసి గొడ్డలితో దాడి 

కడ్తాల్‌ మండలం రావిచేడ్‌లో ఘటన 

సాక్షి, కడ్తాల్‌: ప్రియుడి మోజులో పడి తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కడ్తాల్‌ మండలం రావిచేడ్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రావిచేడ్‌ గ్రామానికి చెందిన మంజుల, సాయిలు దంపతులు. వీరు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు వలస వెళ్లారు. అక్కడ బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగదీస్తుండగా అదే ప్రాంతంలో నల్గొండ జిల్లా డిండి మండలం  చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల మధుకర్‌రెడ్డి మంజులకు పరిచయమయ్యాడు. వీరిమధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు హైదరాబాద్‌ నుంచి భార్యాభర్తలు స్వగ్రామం రావిచేడ్‌కు చేరుకుని గ్రామంలోనే నివసిస్తున్నారు.

అయితే మంజులను మరవలేక మధుకర్‌రెడ్డి రావిచేడ్‌కు చేరుకున్నాడు. రెండు రోజుల కిందట పనులపై వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో భార్యతో పాటు ఇంట్లో మధుకర్‌రెడ్డి కనిపించడంతో భార్యను నిలదీశాడు. కోపోద్రిక్తుడై సాయిలు ఇంట్లో ఉన్న గొడ్డలితో అతడిపై దాడికి ప్రయత్నించాడు. అయితే భార్య, ప్రియుడు మధుకర్‌రెడ్డి ఇద్దరు కలిసి సాయిలుపై దాడికి పాల్పడ్డారు. సాయిలుకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు కడ్తాల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్‌ఐ సీతారాంరెడ్డి విచారణ చేపట్టారు. సాయిలును చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దాడికి పాల్పడిన మధుకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు