భర్త నుంచి ప్రియుడిని కాపాడిన భార్య

6 May, 2019 10:29 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోకరాజు

సాక్షి, గుడివాడ : భార్య ప్రియుడిపై భర్త దాడి చేసి అతని బైక్‌ను దగ్ధం చేసిన ఘటన క్రిష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన మురళీకృష్ణ, శ్యామలకు వివాహం జరిగింది. అయితే, మనస్పర్ధల కారణంగా ఐదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ సమయంలోనే శ్యామలకు ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గోకరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం గోకరాజు వాంబే కాలనీలోని శ్యామల ఇంటికి వచ్చాడు. అయితే, అదే రోజు అర్ధరాత్రి మురళీకృష్ణ కూడా శ్యామల ఇంటికి వచ్చాడు. 

దీంతో ఇంట్లో ఉన్న ప్రియుడు గోకరాజును శ్యామల దాచి పెట్టింది. తలుపు తీయటానికి ఆలస్యం కావటంతో అనుమానం వచ్చిన మురళీ కృష్ణ ఇంట్లో వెతికాడు. గోకరాజు కనబడటంతో అతనిపై మురళీకృష్ణ కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన శ్యామల భర్త మురళీకృష్ణ కళ్లల్లో కారం కొట్టి ప్రియుడిని రక్షించుకుంది. మురళీకృష్ణ కళ్లు కనిపించకుండా ఉండటంతో శ్యామల, గోకరాజు ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. కోపంతో రగిలిపోయిన మురళీకృష్ణ ఇంటి బయట ఉన్న గోకరాజు బైక్‌ను దగ్ధం చేశాడు. గోకరాజుకు కత్తి గాయం కావటంతో చికిత్స నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు