భర్తతో గొడవ పడి మహిళ ఆత్మహత్య 

13 Jun, 2019 09:23 IST|Sakshi

సాక్షి, చెన్నై: భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకుంటూ టిక్‌టాక్‌లో వీడియో పెట్టింది ఓ మహిళ. ఈ సంఘటన తమిళనాడులో చోటు వేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెరంబలూరుకు చెందిన శివ, అనిత దంపతులకు ఏడేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. శివ ఉపాధి కోసం సింగపూర్ వెళ్లగా అనిత పిల్లలను చూసుకుంటూ పెరంబలూరులోనే నివశిస్తుంది. అనిత ఖాళీగానే ఉండటంతో టిక్‌టాక్‌ అలవాటు వ్యసనంగా మారింది. దీంతో పిల్లలను కూడా పట్టించుకోకుండా టిక్‌టాక్‌ ఏంటని శివ భార‍్యను మందలించాడు. అయినా ఆమె తీరు మారలేదు. రెండు రోజుల కిందట చిన్న కొడుకు కిందపడటంతో దెబ్బలు తగిలాయి. 

అయినా అనిత పట్టించుకోకుండా టిక్‌టాక్‌ లోకంలో ఉందంటూ ఇరుగు పొరుగు వారు శివకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో శివ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెందిన అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకు‍ండా భర్త మందలించాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పురుగుల మందు తాగుతూ వీడియోతీసి టిక్‌టాక్‌లో పెట్టింది. అనిత పురుగుల మందు తాగడం, వెంటనే మంచి నీళ్లు తాగడం వంటి దృశ్యాలు టిక్‌టాక్‌ ద్వారా వెలుగులోకి వచ్చాయి.

క్షణాల్లో ఆమె స్పృహ తప్పడం వంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అనితను బంధువులు తిరుచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. కాగా గతంలో టిక్‌టాక్‌పై మద్రాస్‌ హైకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బ్యాన్‌ తొలగించారు.

మరిన్ని వార్తలు