పీలేరులో జేఎస్పీదే గెలుపు: తులసిరెడ్డి

9 May, 2014 20:32 IST|Sakshi
పీలేరులో జేఎస్పీదే గెలుపు: తులసిరెడ్డి

హైదరాబాద్: చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ విజయబావుటా ఎగుర వేయనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఎన్.కిషోర్‌కుమార్‌రెడ్డి 20 వేల మెజార్టీతో పీలేరులో గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

శుక్రవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలోని రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, అనంతపురం లోక్‌సభ స్థానాల పరిధిలోని ఏడెనిమిది అసెంబ్లీ స్థానాల్లోని ప్రధాన పార్టీలకు జేఎస్పీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి అభ్యర్థులు గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. పదవుల కోసం తాము పార్టీ పెట్టలేదనీ, ఉన్న పదవుల్ని త్యజించి సమైక్యాంధ్ర కోసం ప్రజల్లోకి వచ్చామన్నారు. గెలుపోటముల సంగతెలాగున్నా, ప్రజల్లో సమైక్యభావన ఏ మేరకు ఉందో అంచనా వేసుకునేందుకు ఎన్నికలు దోహదపడతాయన్నారు.

మరిన్ని వార్తలు