రెబెల్స్‌పై వేటు

18 Apr, 2014 02:41 IST|Sakshi

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్ వేటువేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెబెల్స్‌ను బహిష్కరిస్తూ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులున్నారు. రామగుండం, కోరుట్ల, హుజూరాబాద్ నుంచి రెబెల్స్‌గా పోటీచేస్తున్న కౌశిక హరి, జువ్వాడి నర్సింగరావు, ఇనుగాల భీంరావులను పార్టీ నుంచి బహిష్కరించారు.
 
 రామగుండం నుంచి కౌశిక హరి పార్టీ టికెట్ ఆశించగా, మైనారిటీ కోటా కింద బాబర్‌సలీంపాషా టికెట్ దక్కించుకున్నారు. దీంతో హరి స్వతంత్రంగా బరిలో నిలిచారు. కోరుట్ల నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు టికెట్ ఆశించగా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లుకు పార్టీ టికెట్  ఇచ్చింది. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేయగా, ఇనుగాల భీంరావు రెబెల్‌గా నిలిచారు. దీంతో ఈ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
 
 ఇద్దరి సస్పెన్షన్
 పార్టీ అభ్యర్థికి కాకుండా ఇతరులకు మద్దతునిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులను సస్పెం డ్ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీం దర్‌రావు తెలిపారు. కోరుట్లలో పార్టీ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు కాకుండా స్వతంత్ర అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుకు గండ్ర రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యంరావు మద్దతునిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిద్దరి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు