రాముడితో కలిసి సీత నడిచిన దూరం 2,322 కి.మీ..?!

17 Jan, 2014 08:35 IST|Sakshi

 తండ్రి మాటతో రాచరికాన్ని వదిలిపెట్టి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వెంట రాగా పద్నాలుగేళ్ల వనవాసానికి బయల్దేరాడు రాముడు. ఉత్తరభారతదేశం నుంచి దక్షిణభారతదేశమంతా వీరు ప్రయాణించినట్టు వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది.


 అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని జనక్‌పూర్, మహారాష్ట్ర, కర్నాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది.


 గోదావరి తీరాన పంచవటి లో సీతను రావణుడు అపహరించాడని, అటునుంచి రాముడు సీతను వెదుకుతూ రామేశ్వరం చేరుకున్నాడని, వానరుల సాయంతో సము ద్రం మీద వారధి నిర్మించి, లంకను చేరి రావణుడిని హతమార్చి, సీతను తీసుకొని తిరిగి అయోధ్య చేరుకున్నాడని కథనం.


     ఈ రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్ - తమిళనాడుల మధ్య దూరం లెక్కిస్తే రోడ్డు మార్గం 2,322 కి.మీ. రైలుమార్గంలో ప్రయాణిస్తే 30-35 గంటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు చేరుకోవచ్చు. కాని నాడు కాలినడకన అరణ్యాలు, కొండకోనలు దాటుకుంటూ నదీపరీవాహక ప్రాంతాలను సమీక్షిస్తూ... వేల యోజనాలు సీతారామ లక్ష్మణులు ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయలేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు.


 రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగసంరక్షణార్థం బాల్యం లోనే అడవులకు వెళ్లి, రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కాని, సీత.. తండ్రి ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి. పట్టు తివాచీల రహదారులే ఆమెకు సుపరిచితం. అలాంటిది అత్తింట అడుగుపెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది. రాముడితో పాటు దుర్భేధ్యమైన అడవి మార్గాల గుండా తనూ కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్లూ, రాళ్లూ, క్రూరమృగాలు, విష సర్పాలు, రాక్షసులు.. ఎండావానలు.. వేటినీ లెక్కచేయక వేల యోజనాలు పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తనూ పాటుపడింది మహిమాన్విత సీత.

మరిన్ని వార్తలు