తెలంగాణలో మావోయిస్టులు 93 మంది...

20 Jun, 2016 20:29 IST|Sakshi

రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 93 ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలోనూ రివార్డులున్న అగ్రనేతలు 28 మంది మాత్రమే ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో ఉన్న మొత్తం మావోయిస్టులు 93 మందిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా, కరీంనగర్‌కు చెందిన వారు 30 మంది ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చత్తీస్‌గఢ్ సరిహద్దు వెంట మావోల కదలికలున్నట్లు పోలీసుశాఖ నిర్ధారించింది. కొత్తగా రిక్రూట్‌మెంట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ గత కొంత కాలంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జాడే లేకుండా పోయినట్లు ఇంటలిజెన్స్ అధికారులు అంచనా వేశారు.

అయితే రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య తగ్గినప్పటికీ సెంట్రల్ కమిటీలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి హవా కొనసాగుతోంది. పార్టీ సెంట్రల్ కమిటీలో 20 మందికిగాను ఏపీ, తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ హరిభూషణ్ నేతృత్వంలో కొనసాగుతున్నట్లు పోలీసుల సమాచారం.

వరుస ఎదురుదెబ్బలతో కుదేలు..
రాష్ట్రంలో పోలీసులు రచిస్తున్న వ్యూహ రచనతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో కీలకనేతలను పొగొట్టుకొని అతలాకుతలమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీగా హతమయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో ఖమ్మం, చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకేసారి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో కీలక నేత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్‌లో 180 మంది మావోయిస్టులు ఉండగా ప్రస్తుతం 140కి పడిపోయింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 93 మంది ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. అందులోనూ ముఖ్యనేతలు రివార్డులున్న వారు కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఉన్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గణపతి, మల్లా రాజిరెడ్డి, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు వంటి వారిపై రూ.25లక్షలు, అలాగే స్టేట్ కమిటీలో ఉన్న వారిపై రూ.20 లక్షలు, జిల్లా కమిటీలో ఉన్న వారిపై రూ.10లక్షలు ఉన్న వారున్నారు.

వ్యూహాత్మకంగా కట్టడి..
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని కట్టడి చేయగలిగారు. ఇన్‌ఫార్మర్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు అనుక్షణం జల్లెడ పట్టడంతో మావోలు కోలుకోలేకపోయారు. పోలీసులు వ్యూహత్మకంగా కట్టడి చేసి.. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. ఒకప్పుడు నల్లమల్ల అటవీ కేంద్రంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తృత కార్యకలాపాలు జరిపిన మావోయిస్టులు ప్రస్తుతం ఉనికే లేకుండా పోయింది. రాష్ట్రంలో అర్బన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మావోయిస్టుల జాడ లేదని ఇంటలిజెన్స్ రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. కేవలం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ కదలికలున్నట్లు పేర్కొంది.

కొత్త రిక్రూట్‌మెంట్‌కు దెబ్బకొట్టిన పోలీసులు..
వరుస ఎన్‌కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోలీసులు గట్టిదెబ్బ కొట్టారు. ఏడాది క్రితం కొత్త రిక్రూట్‌మెంట్ కోసం నక్సల్స్ చేసిన ప్రయత్నాలను పోలీసులు అణిచివేశారు. కొన్ని విద్యాలయాల వేదికగా మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. వెంటనే అనుమానితులందరిపై డేగకన్ను వేసిన పోలీసులు అణుక్షణం వెంటాడారు. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎంటెక్ విద్యార్థిని మహిత అలియాస్ శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి భయబ్రాంతులకు గురిచేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుతో కొత్త వారు పార్టీలో చేరేందుకు విముఖత చేపేలా చేశారు.
 

>
మరిన్ని వార్తలు