Venkatesh Daggubati: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసిన వెంకీ మామ

11 Dec, 2023 15:35 IST|Sakshi

విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ సైంధవ్‌. ఇది ఈయన నటిస్తున్న 75వ సినిమా. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం తీసుకుంది. సోమవారం నాడు సైంధవ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన చిత్రయూనిట్‌ దుర్గమ్మను దర్శించుకుంది. అనంతరం వెంకటేశ్‌ బాబాయ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేశాడు.

వెంకటేశ్‌ మాట్లాడుతూ.. సైంధవ్‌ మూవీ కొత్త కథ, కథనంతో తెరకెక్కింది. సినిమాలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుంది. దర్శకుడు శైలేష్ కథ చెప్పగానే ఒప్పుకున్నాను. హీరోయిన్ శ్రద్ధ చాలా బాగా నటించింది. ప్రేక్షకులు మెచ్చితే  సైంధవ్‌ 2 కూడా తీస్తాము. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను. బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తాను అని చెప్పాడు.

దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. హిట్, హిట్‌ 2 సినిమాల ఘన విజయాల తర్వాత ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను. వెంకటేశ్‌ 75వ చిత్రం నేను తీయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరూ చూడని కొత్త విక్టరీ వెంకటేశ్‌ను మీరు ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారు అని తెలిపాడు.

చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్‌ ఆంటోని భార్య ఎమోషనల్‌

>
మరిన్ని వార్తలు