జీతాలు పెంచకుండా జీవితాలపై కొడతారా..

24 Jul, 2015 22:15 IST|Sakshi

ఉప్పల్: కార్మికులు కడుపు మాడి జీతాలు పెంచాలని ఉద్యమం చేస్తే వారి జీవితాలపై కొడతారా అని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పోరాటానికి మద్దతుగా శుక్రవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సీపీఎం, సీఐటీయూ, బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీపర్లు ఉద్యమం చేస్తే ఉద్యోగాలు తీసివేయడం దారుణమన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాల ఉద్యోగులు మూకుమ్మడి సమ్మెకు దిగినా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని గుర్తు చేశారు.

కారణం లేకుండా కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో శామీర్‌పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మన్, అశ్వథ్థామరెడ్డి, సుమన్ శర్మ, రావుల బాలకృష్ణ, రేవెల్లి రాజు, గోనే అంజయ్య, ఎనుముల మహేష్‌కుమార్, పవిత్ర, సీపీఎం నాయకులు మన్నె నర్సింహరెడ్డి, వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు