కాంగ్రెస్‌కు మరో షాక్!

10 Jun, 2016 01:20 IST|Sakshi
కాంగ్రెస్‌కు మరో షాక్!
  • కేసీఆర్‌తో గుత్తా, సురేశ్‌రెడ్డి, వివేక్, వినోద్ భేటీ
  • టీఆర్‌ఎస్‌లో వారి చేరికకు సీఎం గ్రీన్‌సిగ్నల్
  •  

     సాక్షి, హైదరాబాద్

    అధికార టీఆర్‌ఎస్ పెద్ద ప్లాన్‌లోనే ఉంది! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో.. ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌తో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు.

    టీఆర్‌ఎస్‌లో వీరి చేరికకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ గుత్తా ఈ నెల 11న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కలిసి ఒకేసారి గులాబీ తీర్థం పుచ్చుకుంటారా అన్న దానిపై స్పష్టత లేదు. అయినా ఈ వారంలోపే వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావిస్తున్నారు. మాజీ ఎంపీ వివే క్ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఏడాది నుంచే ప్రచారంలో ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడంతో ఈ నాయకులంతా బయటకు రావాలని నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు