ప్రదీప్‌ అనుమానాస్పద మృతి

4 May, 2017 09:46 IST|Sakshi
ప్రదీప్‌ అనుమానాస్పద మృతి

- ఫ్యాన్‌కు ఉరేసుకొని బుల్లితెర హీరో ఆత్మహత్య!
- ఇంట్లో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి శ్రవణ్‌
- రాత్రి వరకు బర్త్‌డే పార్టీ
- వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌పై భార్య పావనితో గొడవ
- బయటకెళ్లి గంట తర్వాత రాక.. మళ్లీ వాగ్వాదం
- బెడ్‌రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్న ప్రదీప్‌
- గదిలో పగిలిన అద్దాలు, రక్తపు మరకలు
- సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో నటిస్తున్న ప్రదీప్‌
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు


సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర హీరో ప్రదీప్‌ కుమార్‌ (29) బుధవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన భార్య దుర్గారెడ్డి అలియాస్‌ పావనిరెడ్డి చెబుతున్నారు. అయితే వారింట్లో శ్రవణ్‌ అనే మరో వ్యక్తి ఉండటం, డైనింగ్‌ టేబుల్‌పై మద్యం సీసా, ఆ సమీపంలో పగిలిన అద్దాలు ఉండటంతోపాటు ప్రదీప్‌ నుదుటిపై గాయం కావడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో ప్రదీప్‌ నటిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ.. సహజీవనం.. పెళ్లి..
హైదరాబాద్‌ నగర శివార్లలోని నెక్నాంపూర్‌ గ్రామ పంచాయతీ గ్రీన్‌ ఐకానిక్‌ అపార్ట్‌మెంట్‌లో భార్య పావనిరెడ్డితో ప్రదీప్‌ నివసిస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన.. తన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడే విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌ పట్టా పొందారు. ప్రదీప్‌కు చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనూ కొన్ని డ్రామాల్లో నటించారు. 2006లో విడుదలైన చుక్కల్లో చంద్రుడు సినిమాలో చిన్న పాత్ర పోషించారు. అదే సినిమాలో నటించిన పావని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారినప్పటికీ జీవితాల్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి ఇరువురూ సహజీవనం చేశారు. 2016 ఆగస్టు 21న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రదీప్‌ ప్రస్తుతం తమిళ సీరియల్‌లోనూ నటిస్తున్నారు. అగ్నిపూలు, కుటుంబ గౌరవం సీరియళ్లలో హీరోయిన్‌గా నటించిన పావని ప్రస్తుతం.. నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్‌లో ప్రదీప్‌తో కలసి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఎవరీ శ్రవణ్‌?
విశాఖపట్నానికి చెందిన డి.శ్రవణ్‌ ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పావనిరెడ్డికి స్నేహితుడైన ఇతడు తరచుగా నెక్నాంపూర్‌లోని వీరి ఇంటికి వస్తుండేవాడు. గతంలో కేవలం సెలవులు ఇచ్చినప్పుడు ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లేవాడు. ఈసారి మాత్రం మూడు నెలల క్రితం ప్రదీప్‌ ఇంటికి వచ్చిన శ్రవణ్‌ ఇక్కడే ఉండిపోయాడు. మంగళవారం శ్రవణ్‌ పుట్టినరోజు కావడంతో పావనిరెడ్డి, బంధువులు శ్రవణ్‌కుమార్‌ స్నేహితులు అదే ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సీరియల్‌ షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రదీప్‌ సైతం ఈ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అతిథులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రదీప్, పావని, శ్రవణ్‌ మాత్రమే ఇంట్లో మిగిలారు.

ఘర్షణ ఎవరి మధ్య జరిగింది?
పావనిరెడ్డి తన వాట్సాప్‌ డీపీగా శ్రవణ్‌తో కలిసి ఉన్న ఫొటో పెట్టినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రదీప్‌ ఈ విషయంపై పావనిని నిలదీశాడని సమాచారం. దీంతో వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రవణ్‌ సైతం కలగజేసుకున్నాడని, అతడికీ ప్రదీప్‌కు ఘర్షణ జరిగినట్లు అనుమానాలున్నాయి. ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన ప్రదీప్‌ గంటన్నర తర్వాత వచ్చాడని, మళ్లీ వాగ్వాదానికి ఉపక్రమించాడని పావని చెబుతున్నారు. తాను బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకో వడంతో ప్రదీప్‌ తీవ్రస్థాయిలో మందలిం చాడని, దీంతో బయటకు వచ్చానని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత ప్రదీప్‌ బెడ్‌రూమ్‌ లోకెళ్లి గడియ పెట్టుకున్నాడని తన వాంగ్మూ లంలో పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బెడ్‌రూమ్‌ తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో శ్రవణ్‌తో కలిసి బలవంతగా తలుపు తెరిచానని చెబుతు న్నారు. ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడని, 108కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి చనిపోయాడని ధ్రువీకరించారని చెప్పారు.

విధ్వంసం, గాయాలకు కారణం?
ఘటనాస్థలి, అక్కడున్న పగిలిపోయిన వస్తువులు, రక్తం మరకలు, ప్రదీప్‌ ఒంటిపై ఉన్న గాయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాట్సాప్‌ డీపీ విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రదీప్‌–పావని–శ్రవణ్‌ మధ్య ఏం జరిగిందనేది కీలకంగా మారింది. డైనింగ్‌ టేబుల్‌పై మద్యం సీసా ఉండటాన్ని బట్టి అక్కడే ప్రదీప్, శ్రవణ్‌ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దానికి సమీపంలో ఉన్న అద్దం, ఇతర వస్తువులు పగిలిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి రక్తం మరకలు బెడ్‌రూమ్‌ వరకు ఉన్నాయి. దీనికి తోడు మృతుడి తలపై ఉన్న గాయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రదీప్‌ కోపంతో బెడ్‌రూంలోకి వెళ్లాడనుకున్నా.. వెంట భార్య పావని ఎందుకు వెళ్లలేదన్నది అంతు చిక్కట్లేదు. ఉరి వేసుకున్న ప్రదీప్‌ను తాను, శ్రవణ్‌ కిందికి దింపామని, ఆ ప్రయత్నాల్లోనే కింద పడటంతో అతడి తలకు గాయమైందని పావని చెబుతున్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీంతో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. పావని వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌చంద్రరావు చెప్పారు.

మాకు ఎలాంటి అనుమానం లేదు: మృతుడి తల్లిదండ్రులు
మా కుమారుడు ప్రదీప్‌ కుమార్‌ మరణంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. పావనిరెడ్డి మమ్మల్ని బాగానే చూసుకునేది. చిన్నపాటి గొడవకే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదు.

శ్రవణ్‌ నాకు అన్న అవుతాడు: పావనిరెడ్డి
శ్రవణ్‌తో కలిసి ఉన్న ప్రొఫైల్‌ పిక్‌ వల్లే గొడవ జరిగిందనేది అవాస్తవం. అతను నాకు అన్నయ్య అవుతాడు. మావారితో కలసి మెలసి ఉంటాడు. అలాగే  ప్రదీప్‌ కుటుంబ సభ్యులతోనూ నాకు ఎలాంటి విభేదాలు లేవు. బుధవారం తెల్లవారుజామున మా మధ్య పెద్దగా గొడవ ఏమీ జరగలేదు. ఇంతకుమించి ఈ సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేను. గతంలో గొడవలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. ఇలా చేస్తాడని ఊహించలేదు.

బావ అంటూ సరదాగా ఉండేవాడు: శ్రవణ్‌రెడ్డి
పావనిరెడ్డి నాకు సోదరి అవుతుంది. నేను ఖతార్‌లో ఉద్యోగం చేస్తుంటా. ప్రతి ఏడాది సెలవుల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ నాలుగు ఐదు రోజులు ఉండి వెళుతుంటా. ఈసారి వీసా సమస్య వల్ల ఇక్కడే ఉండిపోయా. ఈ సమయంలో న్యూట్రిషన్‌ ప్రోగామ్‌ చేద్దామని ప్లాన్‌ చేశా. ప్రదీప్‌ భాగస్వామి అవుతా అన్నాడు. బుధవారం రాత్రి బర్త్‌డే జరిగాక 12.30 గంటలకు సిగరెట్‌ కాల్చి వస్తాను బావా అంటూ వెళ్లి గంటసేపటి తర్వాత వచ్చాడు. ఇంతసేపు ఎటు వెళ్లావని, ఆందోళనకు గురయ్యానని పావని అడిగింది. ఈ చిన్నపాటి గొడవ తర్వాత ప్రదీప్‌ బెడ్‌రూమ్‌కు వెళ్లడం, ఉదయం ఉరివేసుకొని కనిపించడం జరిగింది.

అన్యోన్యంగా ఉండేవాళ్లు
ప్రతి ఫ్రెండ్‌కు సంబంధించిన బర్త్‌డే పార్టీలు, ఫంక్షన్‌లు ఏమి ఉన్నా ఇద్దరూ అన్యోన్యంగా వచ్చి ఎంజాయ్‌ చేసేవాళ్లు. వాళ్ల వాళ్ల బర్త్‌డేలను సర్‌ప్రైజ్‌గా ప్లాన్‌ చేసి బాగా చేసుకునేవారు. ఏ ఫంక్షన్‌ అయినా హాజరయ్యేవారు. రెడ్‌ ఎఫ్‌ఎం రెడ్‌ కార్పెట్‌ ప్రోగ్రామ్‌లో బాహుబలి–2 రెండు టికెట్లు తీసుకొని సినిమాకు కూడా వెళ్లారు. అన్యోన్యంగా ఉండటంతో పాటు ఒక రిని ఒకరు బాగా చూసుకునేవారు.
– చైతూ, రేడియో జాకీ

మరిన్ని వార్తలు