రేపు సాక్షి ఎరీనావన్ యూత్‌ఫెస్ట్

20 Feb, 2016 09:09 IST|Sakshi
రేపు సాక్షి ఎరీనావన్ యూత్‌ఫెస్ట్

సిద్ధమైన ఎల్బీ స్టేడియం  
సందడి చేయనున్న సినీ తారలు

 
 సాక్షి, హైదరాబాద్: తారల తళుక్కులు.. ఉత్తేజాన్ని నింపే బాలీవుడ్ ప్రముఖ సింగర్ల స్వరాలు.. కిక్కెక్కించే కామెడీ.. విద్యార్థుల సందడి.. వీటన్నింటికీ వేదిక కానుంది హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం. సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ ఈనెల 21న ఈ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. కేవలం విద్యకే పరిమితం కాకుండా విద్యార్థుల అభిరుచులకు పెద్దపీట వేస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాక్షి మీడియా గ్రూప్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో గానం, మ్యూజిక్, కళ, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.

గతనెల 22న మొదలైన ఈ పోటీల్లో వందల కళాశాలల నుంచి వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తుదిగా 225 కళాశాలలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. రేపు జరిగే  ఫెస్ట్‌లో వీరందరికీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌లో అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సినీ దర్శకురాలు మంచు లక్ష్మి, విజ్ఞాన్ వర్సిటీ చైర్‌పర్సన్ ఎల్. రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావీద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు.

వీరితోపాటు ప్రముఖ సింగర్స్ సెహగల్, రోల్ రిదా హుషారెక్కించనున్నారు. అలాగే సినీతారలు ఆదా శర్మ, డింపుల్ చొపాడే, రెజినా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. కాగా ఈ ఫెస్ట్‌కు విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంది. వీరంతా తమ కళాశాలకు చెందిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి. ఎంట్రీ పాసుల కోసం సాక్షి ఎరీనా వన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మేరా ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9505834448, 040-23256134కు కాల్ చేయవచ్చు.

మరిన్ని వార్తలు