పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 10.45 గంటల నుంచి 11 గంటల మధ్యలో పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, పహాడీషరీఫ్, బహదూర్పురా, కిషన్బాగ్, గోల్కొండ, హుస్సేనీఆలం, చార్మినార్, కాలాపత్తర్, రాజేంద్రనగర్, శివరాంపపల్లి, హసన్న నగర్, శాస్త్రీపురం, ఎంఎం పహడీ, ఎర్రబోడ తదితర ప్రాంతాల్లో నాలుగైదు సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలామంది రాత్రంతా మేల్కొనే ఉన్నారు.