ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..

21 Sep, 2015 14:58 IST|Sakshi

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఓటును కూడా అకారణంగా తొలగించరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు తొలగించారనేది అవాస్తవమని, 2014 కంటే సనత్ నగర్ లో ఇప్పుడు 7వేల ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు తొలగించారంటూ నిరాధారంతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటం తగదన్నారు. ఓట్లు తొలగించినట్లు తమకు ఇప్పటివరకూ ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని తలసాని తెలిపారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బుద్ధిలేని మాటలు చెబుతున్నారని, చౌకబారు రాజకీయాలతో అనవసర ప్రకటనలు చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు  చేయటం సరికాదన్నారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు