సాక్షి, న్యూఢిల్లీ/బ్రస్సెల్స్ : కరోనా వైరస్ సోకకుండా తమ కోవిడ్-19 వ్యాక్సిన్ సంవత్సరం పాటు రక్షణ కల్పించే అవకాశం ఉందని బ్రిటిష్ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సోరియట్ వెల్లడించారు. బ్రిటన్ లో మొదటి దశ ట్రయల్ త్వరలో ముగియనుందనీ, మూడవ దశ కూడా ఇప్పటికే ప్రారంభమైందని పాస్కల్ చెప్పారు.
అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబరులో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రానున్నాయని చెప్పారు. అలాగే దీనికి సమాంతరంగా వ్యాక్సిన్ తయారీ కొనసాగుతోందన్నారు. అన్ని ఫలితాలు అనుకూలిస్తే అక్టోబర్ నుండి వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉంటామని సోరియట్ వెల్లడించారు. మంగళవారం బెల్జియం రేడియో స్టేషన్తో మాట్లాడుతూ పాస్కల్ ఈ వివరాలు అందించారు.
కాగా ఇప్పటికే బ్రిటన్, అమెరికా దేశాలతో కీలక ఒప్పందాలను చేసుకున్నఆస్ట్రాజెనెకా, ఇటీవల యూరోపియన్ యూనియన్కు 400 మిలియన్ మోతాదుల వరకు వ్యాక్సిన్ను సరఫరా చేయడానికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన టీకాపై మానవ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (తుది ప్యాకేజీ ప్రకటించవచ్చు : ఆర్బీఐ డైరెక్టర్)