కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!

24 Apr, 2020 13:12 IST|Sakshi

కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరూలా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్‌-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చాలా మందిలో పొడిదగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు బయటపడకున్నా కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళనకరంగా పరిణమించింది. మొన్నటి వరకు వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిన ప్రాణాంతక వైరస్‌ ఇప్పుడు పసిపిల్లలపైనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో  యూరప్‌, అమెరికా దేశాల డెర్మటాలజిస్టులు టీనేజర్లలో కోవిడ్‌-19 లక్షణాలు గుర్తించేందుకు వారి కాలి బొటనవేళ్లను పరీక్షించాలని పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.(కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్‌ఓ)

కరోనా వ్యాపించిన తొలినాళ్లలో చాలా మంది చిన్నారుల్లో పాదాలు. బొటనవేళ్లకు వాపులు రావడం, వివర్ణం కావడం గుర్తించామని ఇటలీ డెర్మటాలజిస్టులు పేర్కొన్నారు. అలాంటి చిన్నారుల్లో కొంతమందికి(అతి తక్కువ సంఖ్యలో) కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. కాబట్టి చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ‘కోవిడ్‌ టోస్‌’టెస్టు(బొటనవేలు పరీక్షించడం) దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక అమెరికన్‌ అకాడమీ డెర్మటాలజీ డాక్టర్ల అసోసియేషన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘కోవిడ్‌ టోస్‌’ఉన్న పిల్లలకు ముందుజాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించింది. ఇక కరోనా పేషెంట్ల ఒక్కో శరీర భాగంలో రక్తం గడ్డకడుతోందంటూ న్యూయార్క్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడ్డ సగం మంది రోగుల్లో మూత్రపిండ నాళాలు, ఊపిరితిత్తుల్లోని భాగాలు, మెదడులో రక్తం చిక్కబడటం గుర్తించామని పేర్కొన్నారు. బ్లడ్‌ క్లాటింగ్‌ వల్ల అధిక మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.(కరోనా రోగుల్లో బ్లడ్‌ క్లాట్స్‌తో ముప్పు)

మరిన్ని వార్తలు