వినూత్న మాస్కు.. ధర రూ.3 వేలు!

26 Jun, 2020 21:20 IST|Sakshi

టోక్యో: మాస్కు లేనిదే మనిషి ఉనికే ప్రమాదంలో పడుతున్న తరుణంలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ‘స్మార్ట్‌ మాస్కు’ను తయారు చేసింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి కావడంతో స్మార్ట్‌ మాస్కును రూపొందించినట్టు డోనట్‌ రోబోటిక్స్‌ సీఈఓ తైసుకే ఓనో తెలిపారు. రోబో తయారీకి ఏళ్లపాటు కృషి చేశామని, ఆ టెక్నాలజీ సాయంతోనే దీన్ని తయారు చేశామని చెప్పారు. తెల్లని ప్లాస్టిక్‌తో తయారైన స్మార్ట్‌ మాస్కును సీ-మాస్కుగా వ్యవహరిస్తామని అన్నారు.

ఇది బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ అవుతుందని తైసుకే తెలిపారు. సీ-మాస్కు ద్వారా మన ఆదేశాలతో మొబైల్‌ యాప్‌ మెసేజ్‌లు పంపడం, కాల్స్‌ చేయడం, మాటల్ని టెక్స్ట్‌ రూపంలోకి మార్చుతుందని అన్నారు. మాస్కు ధరించిన వ్యక్తి చిన్నగా మాట్లాడినా దానిని శబ్ద తీవ్రతను యాప్‌ అధికం చేస్తుందన్నారు. జపాన్‌ భాష నుంచి 8 ఇతర భాషల్లోకి సీ-మాస్కు ద్వారా యాప్ పదాల్ని‌ తర్జుమా చేస్తుందని అన్నారు. ఒక నాణ్యమైన మాస్కుపైన సీ-మాస్కు అమర్చబడి ఉంటుందని తైసుకే తెలిపారు. జపాన్‌ మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్‌ నాటికి 5000 యూనిట్లు పంపిస్తామని అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో వీటిని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. సీ-మాస్కు ధర రూ.3 వేలు.
(చదవండి: పాక్‌లో 30 శాతం బోగ‌స్‌ పైల‌ట్లు)

మరిన్ని వార్తలు