డెక్సామిథాసోన్‌ వినియోగం, వాడకానికి డబ్ల్యూహెచ్‌ఓ ఓకే‌

23 Jun, 2020 10:10 IST|Sakshi

జెనీవా: కరోనా రోగుల పాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూఓ) సోమవారం పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడటం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ‘బ్రిటీష్‌ ట్రయల్‌లో ఈ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగింది. ఉత్పత్తిని వేగవంతం చేయాలి’ అని ఆయన సూచించారు. గత వారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔ షధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు తెలిసింది.

‘పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే  ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిరూపితమైనది. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్నాం’ అని జెనీవాలో జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్‌ వెల్లడించారు. అంతేకాక ‘ఇప్పుడు మన ముందున్న సవాళ్లు ఏమిటంటే ఈ ఔషధ ఉత్పత్తిని పెంచడం.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా.. దీని అవసరమున్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం.. ఎక్కువ అవసరమైన చోట దృష్టి సారించడం’ అని పేర్కొన్నారు.(వాటి వ‌ల్ల క‌రోనా చావ‌దు: డ‌బ్ల్యూహెచ్‌వో)

ప్రాముఖ్య దేశాలు
డెక్సామిథాసోన్ 60 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అంతేకాక తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న రోగులకు లేదా కోవిడ్-19‌ నివారణ కోసం ఈ  ఔషధం పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు. హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు. దీని సరఫరాలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ రోగులు ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని టెడ్రోస్‌ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన ఫలితంగా నాణ్యత లేని లేదా తప్పుడు ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున.. ఈ ఔషధ ఉత్పత్తిదారులు నాణ్యతకు సంబంధించి హామీ ఇవ్వవలసి ఉంటుందని టెడ్రోస్ హెచ్చరించారు.

మింక్‌తో సంబంధం
చైనా వుహాన్‌ కరోనాకు జన్మస్థలంగా భావిస్తున్న క్రమంలో  శాస్త్రవేత్తలు ఇక్కడి మాంసం దుకాణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మొదట జంతువుల నుంచి మానవులకు సోకిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనాపై పనిచేస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఉత్తర ఐరోపాలో జరిపిన అధ్యయనాల్లో కరోనా వైరస్‌ మానవులకు మింక్(అమెరికాలో కనిపించే ఓ జంతువు) ద్వారా సోకినట్లు తెలుస్తుందన్నారు. నెదర్లాండ్స్ మరియు డెన్మార్క్‌లో కొన్ని మింకులు కరోనా వైరస్‌కు సానుకూలంగా ఉన్నాయి  అని వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

మరిన్ని వార్తలు