‘కొత్త హిస్టరీ క్రియేట్ చేయాలి’... చాలామందికి ఉండే ఎయిమ్ ఇది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక సినిమా వంద కోట్లు వసూలు చేస్తే.. ఆ తర్వాతి సినిమా అంతకు మించి కలెక్ట్ చేయాలనే టార్గెట్ ఉంటుంది. అలాగే, ఒక సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజైతే ఆ తర్వాతి సినిమా థియేటర్ల సంఖ్య పెరగాలని కొందరు దర్శక–నిర్మాతలు టార్గెట్ పెట్టుకుంటారు.
ప్రస్తుతం ‘2.0’ టీమ్ టార్గెట్ ఇదేనట. ఒక్క ఇండియాలోనే 7 వేల స్కీన్లలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే ఎక్కువ థియేటర్లలో విడుదలైన తొలి ఇండియన్ మూవీగా ‘2.0’గా రికార్డ్ దక్కించుకుంటుంది. మొత్తం 15 భాషల్లో రిలీజ్ చేసి, మరో రికార్డ్ను కైవసం చేసుకోవాలనుకుంటున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్లతో డీల్ సెట్ చేస్తున్నారట.
‘2.0’ టీమ్ రికార్డుల మీద దృష్టి పెట్టిన తీరు చూస్తుంటే, ‘బాహుబలి’ని అధిగమించాలన్నది వాళ్ల టార్గెట్ అనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. రికార్డుల సంగతి పక్కన పెడితే... ఈ చిత్రం కోసం శంకర్ రెండు క్లైమాక్స్లు తీస్తున్నారని, రిలీజ్ నాటికి ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తారని భోగట్టా. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.