ప్రేమరాగం పాడతారా?

27 Mar, 2019 00:28 IST|Sakshi
తాప్సీ,అభిషేక్‌ బచ్చన్‌

కవి, గేయ రచయితగా మారనున్నారట బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌. ఇందుకోసం బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ కవి, గేయ రచయిత సాహిర్‌ లుధియాన్వీ బయోపిక్‌ను తెరెకెక్కించాలని భన్సాలీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్‌ ఖాన్, ఐశ్యర్యా రాయ్, దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్‌... తారాగణంగా ఇలా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ బయోపిక్‌లో అభిషేక్‌ బచ్చన్, తాప్సీల పేర్లు హీరోహీరోయిన్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికీ ఈ సినిమా కథను నరేట్‌ చేశారట భన్సాలీ. సాహిర్‌గా అభిషేక్‌ బచ్చన్, ఆయన ప్రేయసి అమ్రితా ప్రీతమ్‌గా తాప్సీ కనిపిస్తారని లేటెస్ట్‌ బాలీవుడ్‌ ఖబర్‌. సాహిర్, అమ్రితా చాలా ఘాటు ప్రేమ అట. ఈ లవ్‌స్టోరీకి రచయిత జస్మీత్‌ రీన్‌ దర్శకత్వం వహిస్తారట. ఈ సంగతి ఇలా ఉంచితే... అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘మన్‌మర్జియాన్‌’ చిత్రంలో తాప్సీ, అభిషేక్‌ బచ్చన్‌ కలిసి నటించిన విషయం తెలిసిందే. మరి.. రెండోసారి కూడా వీరి జోడి కుదిరేనా? ప్రేమరాగం పాడేనా? లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ!

మరిన్ని వార్తలు