శింబు తమ్ముడి పెళ్లయింది..

28 Apr, 2019 16:26 IST|Sakshi

పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్‌ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఆయన సోదరుడు మాత్రం పెళ్లి చేసేసుకున్నాడు. సీనియర్‌ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్‌ రెండవ కుమారుడు కురళరసన్‌కు శుక్రవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఓ ఇంటి వాడయ్యాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఇతడు ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళు చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యాడు కూడా.

కాగా కురళరసన్‌ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో అతను ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. శుక్రవారం కురళరసన్, తన ప్రేమించిన నబీలా అహ్మదును ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. స్థానిక అన్నాశాలైలోని మసీదులో జరిగిన ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. తమ్ముడు పెళ్లి కోసం లండన్‌లో ఉన్న శింబు చెన్నైకి వచ్చాడు. ఈ నవ వధూవరుల వివాహ రిసెప్షన్‌ను టీ.రాజేందర్‌ ఈ నెల 29న చెన్నైలోని ఒక స్టార్‌ హోటల్‌లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.


 

మరిన్ని వార్తలు