విశాల్‌ స్థానంలో శింబు..!

28 Mar, 2020 12:30 IST|Sakshi

విశాల్‌ నటించాల్సిన కొత్త చిత్రంలో సంచలన నటుడు శింబు నటించనున్నారనేది తాజా సమాచారం. విశాల్‌ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండింటికీ ఆయనే నిర్మాత కావడం విశేషం. అందులో ఒకటి మిస్కిన్‌ దర్శకత్వంలో నటిస్తున్న తుప్పరివాలన్‌– 2. ఈ చిత్రం అధిక భాగం లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. అయితే చిత్ర షూటింగ్‌ మధ్యలోనే విశాల్‌తో వివాదాలు తలెత్తడంతో దర్శకుడు మిస్కిన్‌ ఆ చిత్రం నుంచి వైదొలిగాడు. దీంతో ఆ చిత్రాన్ని తానే దర్శకత్వం చేస్తానని విశాల్‌ ప్రకటించాడు.

వివాదానికి కారణం బడ్జెట్‌ పెరగడమే అని ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకున్నారు. కాగా, విశాల్‌ నటిస్తున్న మరో చిత్రం చక్ర.  ఈ చిత్రం ద్వారా ఎమ్‌ఎస్‌ ఆనందన్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ చిత్రంలో విశాల్‌ కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా నటిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ చెప్పిన కథ నచ్చడంతో నిర్మించడానికి సిద్ధమయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర బడ్జెట్‌ పెరిగిపోవడంతో ఇప్పటికే రెండు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్‌ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలోనే  ఈ చిత్రాన్ని సెవంత్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌ కుమార్‌ నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. కాగా, ఈ చిత్రంలో హీరోగా నటుడు శింబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ సమాచారం. శింబు ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్న మానాడు చిత్రంలో నటిస్తున్నా డు. కాగా, మానాడు తర్వాత శింబు దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ చిత్రంలో నటిస్తారని టాక్‌.
 

మరిన్ని వార్తలు