మళ్లీ హీరోగా..

24 Jul, 2017 03:09 IST|Sakshi
మళ్లీ హీరోగా..

తమిళసినిమా: నటుడు జిత్తన్‌ రమేశ్‌ చాలా గ్యాప్‌ తరువాత హీరోగా రీఎంట్రీ అవుతున్నారు. జిత్తన్‌ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన కొన్ని చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నటనకు దూరమై తన తండ్రి ఆర్‌బీ.చౌదరి నిర్మిస్తున్న చిత్రాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా నండు ఎన్‌ నన్భన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయనకు జంటగా నెంజిరుక్కువరై, పయనం  చిత్రాల ఫేమ్‌ పూనంకౌర్‌ నాయకిగా నటిస్తున్నారు.

ఈ అమ్మడు చాలా గ్యాప్‌ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇదే అవుతుంది. అసామి, ఇన్నారుక్కు ఇనారెండ్రు చిత్రాల ఫేమ్‌ ఆండాళ్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. సంతానభారతి, ఆర్‌ఎన్‌ఆర్‌.మనోహర్, చాందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న దీనికి ఎస్‌ఎన్‌.అరుళ్‌గిరి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక యువతికి, పీతకు మధ్య స్నేహం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం నండు ఎన్‌ నన్భన్‌ అని చెప్పారు.

తరచూ సముద్ర తీరానికి వెళ్లే కథానాయకికి అక్కడ ఒక పీత ఫ్రెండ్‌ అవుతుందన్నారు.అలాంటి పరిస్థితిలో హీరోయిన్‌ ప్రేమికుడు కనిపించకుండా పోతాడని, ఆ విషయాన్ని తన ఫ్రెండ్‌ పీతకు తెలియజేయగా అది ఆమె ప్రేమికుడిని కనుగొనడానికి ఎలా సహకరించిదన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. పీతతో హీరోయిన్‌ స్నేహం ఏమిటనే సందేహం కలగవచ్చునని, నాన్‌ఈ చిత్రంలో ఒక పెద్ద విలన్‌పై చిన్న ఈగ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇదీ అంతేనన్నారు. ఈ చిత్రం ద్వారా చిన్న సందేశాన్ని కూడా చెప్పనున్నట్లు దర్శకుడు తెలిపారు.