అభిమానుల ప్రేమే నా బలం

10 Sep, 2018 01:31 IST|Sakshi
బింద్రా రాయ్, ఆరాధ్య, ఐశ్వర్య

హీరోయిన్‌గా ఐశ్వర్యా రాయ్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అందాల సుందరి సాధించిన అవార్డులు, చేసిన పాత్రలను బట్టి ఆమె కొత్త కథానాయికలకు ఒక రోల్‌ మోడల్‌ అని చెప్పవచ్చు. ఐశ్వర్యా రాయ్‌లోని ఇలాంటి లక్షణాలే ఆమెకు ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును తెచ్చిపెట్టాయి. ఉమెన్‌ ఇన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇండియా (డబ్ల్యూఐఎఫ్‌టి) –2018 అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డ్స్‌ ప్రదాన కార్యక్రమం అమెరికాలో జరిగింది. ఈ వేడుకలో తల్లి బ్రిందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలసి ఐశ్వర్యా రాయ్‌ పాల్గొన్నారు. ‘‘ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది.

  శ్రేయోభి లాషులు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నా బలం’’ అని అవార్డ్‌ సీక్వరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఐశ్వర్యా రాయ్‌. అలాగే ఈ వేడుకలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, డైరెక్టర్‌ జోయా అక్తర్‌ కూడా పాల్గొన్నారు. జాన్వీ కపూర్‌కు ‘ధడక్‌’ సినిమాకు బెస్ట్‌ డెబ్యూ కేటగిరీలో డబ్ల్యూఐఎఫ్‌టి ఎమరాల్డ్‌ అవార్డు రాగా, జోయా అక్తర్‌కు వైలర్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌ దక్కింది. ‘‘నా మిసెస్‌కి ఈ అవార్డ్‌ రావడం హ్యాపీగా ఉంది. అక్కడున్న ఆరాధ్య తనకు ప్రేమతో హగ్‌ ఇస్తుంది. నేనేమో ఆ ఫోటో చూస్తూ ప్రౌడ్‌ హస్బెండ్‌లా ఫీల్‌ అవుతున్నాను’’ అని అభిషేక్‌ తన ఆనందాన్ని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు