‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’

27 Jul, 2017 21:33 IST|Sakshi
‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’

హైదరాబాద్: ‘సినిమా బాగుంటే గతంలో తొలి వారంలోనో, రెండో వారంలోనో హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. మూవీ టాక్‌ ఏంటన్నది విడుదలైన రోజే విషయం తెలిసిపోతుందని’. నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. గురువారం జరిగిన ఫిదా మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫిదా మూవీని శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా తీశారు. ఆయన కెరీర్ లో ఇదే గొప్ప విజయమని తాను భావిస్తున్నట్లు అల్లు అరవింద్ చెప‍్పారు. నిర్మాతగా దిల్ రాజు సక్సెస్ చూస్తే తనకు చాలా ఈర్ష్యగా ఉందని చెబుతూ ఆయన నవ్వేశారు. దిల్ రాజు వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దిల్ రాజు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

హీరోయిజాన్ని కాదు కథను నమ్మి సినిమా తీసే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని కొనియాడారు. హీరో వరుణ్ తేజ్ సక్సెస్ ను ఆయన తండ్రి నాగబాబు ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మూవీలో వరుణ్ చాలా నేచురల్‌గా నటించాడని, అతడి నటనకు అంతా ఫిదా అవుతారని చెప్పారు. హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ’ఆమె ఎంత మంచి డ్యాన్సరో మన అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో ఆమె డ్యాన్స్ అంత ఎలివేట్ కాలేదు. అయితేనేం తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరో మూవీలో ఆమె నుంచి పూర్తిస్థాయి డ్యాన్స్ ఫెర్మార్మెన్స్ ను చూస్తామన్నారు’. ఇలాంటి మంచి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అల్లు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు.

>