ఏవీఎస్ మరణం తీరని లోటు: బాపు

10 Nov, 2013 15:13 IST|Sakshi
ఏవీఎస్ మరణం తీరని లోటు: బాపు
నటుడు, దర్శకుడు ఏవీఎస్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ దర్శకుడు బాపు గుర్తు చేసుకున్నారు. తనకు ఏవీఎస్ ను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ పరిచయం చేశారు అని అన్నారు. ఆసమయంలో జర్నలిస్టుగా పనిచేస్తూ.. దూరదర్శన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని ఏవీఎస్ ను శ్రీకాంత్ పరిచయం చేశాడని బాపు తెలిపారు. ఎలాంటి శ్రమ లేకుండానే ఇతరులను నవ్వించడం ఏవీఎస్ ప్రత్యేకత అని బాపు అన్నారు. 
 
అద్బుతమైన టాలెంట్, మిమిక్రీ నైపుణ్యం కల ఏవీఎస్ ను ఇష్టపడటానికి ఎంతో సమయం పట్టలేదు అని అన్నారు. తాను దర్శకత్వం వహించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంలో నత్తి ఉన్న మేనేజర్ గా నటించిన ఏవీఎస్ కు నంది అవార్డు కూడా వచ్చిందన్నారు. ఏవీఎస్ ఆకస్మిక మరణం పరిశ్రమ తీరని లోటు అని బాపు అన్నారు. 
 
శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఎన్టీఆర్ తో నటించారని.. ఆ చిత్రం ఆలస్యం కావడంతో ముందు మిస్టర్ పెళ్లాం విడుదలైందని బాపు తెలిపారు. కాలేయ వ్యాధితో బాధపడుతూ ఏవీఎస్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.