వివాదంలో షారూఖ్‌ ‘జీరో’

20 Nov, 2018 10:04 IST|Sakshi

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జీరో. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న షారూఖ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. బాద్‌షా మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా కష్టాల్లో పడింది. ట్రైలర్‌లో చూపించిన ఓ సీన్‌లో షారూఖ్‌ బనియన్‌, షార్ట్‌ ధరించి సిక్కులు పవిత్రంగా భావించే కిర్పన్‌ను పట్టుకోవటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ అనే న్యాయవాధి ఆ సీన్‌ను తొలగించాలంటూ షారూఖ్‌తో పాటు చిత్రయూనిట్‌పై ముంబై హైకోర్ట్‌లో పిటీషన్‌ వేశారు. అంతేకాదు జీరో సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వకుండా ఆపాలని, ఒక వేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పిటీషన్‌ను విచారణకు సీక్వరించిన కోర్టు నవంబర్‌ 30న విచారించనున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు