మళ్లీ ట్యూన్‌ అయ్యారు

3 Dec, 2019 03:45 IST|Sakshi
చిరంజీవి

చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒకటో రెండో మాస్‌ పాటలు ఉండాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన ‘సైరా’ కథలో ఆ స్కోప్‌ లేదు. అందుకే తన తాజా చిత్రంలో ఆ కొరతను తీర్చనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని సమాచారం.

చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’లో ‘రామ్మా చిలకమ్మా..’, ‘ఇంద్ర’లో ‘దాయి దాయి దామ్మా..’, ‘జై చిరంజీవా’లో ‘జై జై గణేశా.. జై కొడతా గణేశా..’ వంటి సూపర్‌ హిట్‌ పాటలను ఇచ్చిన మణిశర్మ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సంగీత చర్చలు విదేశాల్లో జరుగుతున్నాయిని టాక్‌. చిరంజీవి–మణిశర్మ కాంబినేషన్‌లో మరో హిట్‌ ఆల్బమ్‌ వస్తుందని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందట.

>
మరిన్ని వార్తలు