ఆకట్టుకుంటోన్న​ ‘సైరా’ ట్రైలర్‌

18 Sep, 2019 17:41 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.  

ట్రైలర్‌లోనే యాక్షన్‌, సెంటిమెంట్‌, దేశ భక్తి చూపించారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్‌.. చివరి వరకూ అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా పలు డైలాగ్‌లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’అంటూ చిరంజీవి పలికే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది.  

మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్‌, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కూడా కావటంతో రామ్‌ చరణ్‌ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

మరిన్ని వార్తలు