మావయ్యతో నటించడం లేదు

4 Aug, 2019 05:54 IST|Sakshi

సినిమాలు చేయడానికి భాషను హద్దుగా పెట్టుకోనంటున్నారు దర్శక–నిర్మాత–నటుడు ధనుష్‌. 2013లో ‘రాంజ్‌నా’, 2015లో ‘షమితాబ్‌’ అనే హిందీ చిత్రాల్లో నటించారు ధనుష్‌. తాజాగా ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్, ధనుష్, సారా అలీఖాన్‌ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే. .‘షమితాబ్‌’ విడుదలైన తర్వాత మీరు ఇప్పటివరకు మరో హిందీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడానికి కారణం ఏంటీ? అన్న ప్రశ్నను ధనుష్‌ ముందుంచితే... ‘‘హిందీలో మరో సినిమా చేయాలని నాకూ ఉంది.

అయితే ‘షమితాబ్‌’ సినిమా బాగా ఆడకపోవడం వల్లే నాకు హిందీలో అవకాశాలు రావడం లేదనే వాదన సరైంది కాదు. అది బ్రిలియంట్‌ ఫిల్మ్‌. సినిమా రిజల్ట్‌ గురించి పక్కనపెడితే ఆ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ వంటి గొప్ప నటుడితోనే నేను స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. ఆ అనుభవాన్ని మరచిపోలేను. కోలీవుడ్‌లో బిజీగా ఉన్నాను. హిందీలో మరో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. కానీ, ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ సినిమా గురించి మాత్రం ధనుష్‌ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్‌ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ‘అందులో నిజం లేదు’ అని స్పష్టం చేశారు ధనుష్‌.

మరిన్ని వార్తలు