కంగనా, రంగోలిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు

10 Jul, 2019 15:25 IST|Sakshi

‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ చిత్ర నిర్మాతలు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల ముంబయిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంగనా రనౌత్‌, ఓ జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సదరు విలేకరి తన ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని కంగనా సమావేశంలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరలయ్యింది. దాంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేదంటే కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని పేర్కొంది.

దాంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ తరఫున నిర్మాత ఏక్తాకపూర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. సినిమా పాట విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని ఏక్తా కపూర్‌ తెలిపారు. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ జులై 26న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరారు.
 

#JudgeMentallHaiKya ! Love and respect to all❤️🙏🏼

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేశారు. ‘కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, కంగన సరైన మార్గంలో పెడుతుంది’ అని పోస్ట్‌ చేశారు. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు తప్పుపట్టారు. వారి ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు.

మరిన్ని వార్తలు