'ఫిదా' అయిన ఓవర్ సీస్

13 Aug, 2017 11:06 IST|Sakshi
'ఫిదా' అయిన ఓవర్ సీస్

మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్ధలు కొడుతూ దూసుకుపోతోంది.  చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్ సీస్ లో 2,000,159 డాలర్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన 7వ తెలుగు సినిమాగా ఫిదా నిలిచింది. ఫిదా కన్నా ముందు బాహుబలి రెండు భాగాలు, ఖైదీ నెం 150, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాలు ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా అందని రికార్డ్ ను సొంతం చేసుకొని ఫిదా చరిత్ర సృష్టించింది.