సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!

5 Jan, 2017 19:08 IST|Sakshi
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. క్రిష్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి- జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ హీరోయిన్‌గా నటించగా, వీరమాత గౌతమిగా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటి హేమమాలిని నటించారు. ఈ సినిమాలకు సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సెర్టిఫికెట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు క్రిష్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 
 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.  సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు. 
 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.