తిరుపతిలో మహానుభావుడి సందడి

11 Oct, 2017 11:57 IST|Sakshi

హాస్యభరితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందించిన మహానుభావుడు చిత్రాన్ని ఆదరిస్తూ విజయాన్ని అందిస్తున్న అభిమానుల ఆదరణ మరువలేనిదని ఆ చిత్రం హీరో శర్వానంద్‌ అన్నారు. తిరుమలలో జరిగిన తన చెల్లెలు వివాహానికి విచ్చేసిన ఆయన మహానుభావుడు చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్‌ థియేటర్‌కు మంగళవారం విచ్చేశారు.

ఆయనకు థియేటర్‌ అధినేత పాంట్రివేటి అభిషేక్‌రెడ్డి, అభిమానులు పూలమాలలో ఘనంగా స్వాగతం పలికారు. హీరో శర్వానంద్‌ అభిమానులతో కలిసి మహానుభావుడు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను నటించిన శతమానంభవతి, రాధ చిత్రాలను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఒకే బ్యానర్‌పై శతమానంభవతి, రాధ, మహానుభావుడు చిత్రాలు రావడం సంతోషకరమన్నారు.

తాను నటించిన రాధ, మహానుభావుడు చిత్రాలు పీజీఆర్‌ థియేటర్‌లో ప్రదర్శించడంతోపాటు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. థియేటర్‌ వద్ద అభిమాన హీరోను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. హీరో శర్వానంద్‌ సెల్ఫీలుదిగి వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో యూవీ క్రియేషన్ డిస్ట్రిబ్యూటర్‌ జగదీష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు