'హౌస్‌ఫుల్' కలెక్షన్లతో దూసుకుపోతోంది!

5 Jun, 2016 17:02 IST|Sakshi
'హౌస్‌ఫుల్' కలెక్షన్లతో దూసుకుపోతోంది!

ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ తాజా కామెడీ సినిమా 'హౌస్‌ఫుల్-3‌'... హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తోంది. తొలిరోజు 15.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు మరింతగా పుంజుకొని రూ. 16.31 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు.  శుక్రవారం విడుదలైన ఈ సినిమా రెండురోజుల్లో మొత్తంగా 31.51 కోట్లు రాబట్టింది.

అక్షయ్‌కుమార్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్‌ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్‌ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్‌-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉన్నట్టు బాలీవుడ్ ట్రెడ్ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. తొలిరెండో రోజుల్లో భారత్‌లో రూ. 31.51 కోట్లు సాధించిన ఈ సినిమా ఆదివారం మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విదేశాల్లోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టుతున్నదని, యూఈఏ కలుపుకొని విదేశాల్లో రెండురోజుల్లో ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్లు (రూ. 13.36కోట్లు) రాబట్టిందని వెల్లడించారు.

గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్‌' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్‌ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, లిసా హేడన్‌, నర్గీస్‌ ఫక్రీ నటించారు. అక్షయ్‌, రితేశ్‌ 'హౌస్‌ఫుల్‌' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది.