నాకు ఇది సక్సెస్‌ ఫుల్‌ రీ ఎంట్రీ – జయప్రద

9 May, 2018 00:43 IST|Sakshi
∙అశ్వనీకుమార్‌ సహదేవ్, కోటి, జయప్రద, ఆకాష్‌ కుమార్, నరసింహారావు

‘‘నేను కొంచెం గ్యాప్‌ తర్వాత సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. నరసింహారావుగారు వచ్చి ‘శరభ’ కథ చెప్పారు. వినగానే సినిమా తప్పకుండా క్లిక్‌ అవడంతో పాటు నాకు సక్సెస్‌ ఫుల్‌ రీ ఎంట్రీ అవుతుందనిపించి చేశా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శరభ’. యన్‌. నరసింహారావు దర్శకత్వంలో ఎ.ఎస్‌.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయప్రద మాట్లాడుతూ –‘‘నటిగా దాదాపు మూడు వందల సినిమాలకు చేరువ కాబోతున్నాను.

ఈ తరుణంలో నాకీ సినిమా ఓ మలుపు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చాలా వేరియేషన్స్‌ ఉన్న పాత్ర నాది. అశ్వనీకుమార్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా ధైర్యంగా మూడేళ్లు ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘నరసింహారావుగారికి ఇది తొలి సినిమా అయినా కూడా ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను చక్కగా డీల్‌ చేశారు. జయప్రదగారు ఈ సినిమాలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు’’ అన్నారు చిత్రసంగీత దర్శకుడు కోటి. ‘‘మంచి విజువల్‌ గ్రాఫిక్స్‌ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతి ఇస్తుంది’’ అన్నారు అశ్వనీకుమార్‌ సహదేవ్‌. హీరో ఆకాశ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు