సెట్‌లో ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు: ఆలియా

11 May, 2016 20:03 IST|Sakshi
సెట్‌లో ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు: ఆలియా

సాధారణంగా ఎవరైనా హీరోయిన్ సినిమాలో నటిస్తోందంటే.. షూటింగ్ చూసేందుకు, ఆమెను దగ్గరగా చూసేందుకు వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకుంటారు. అలాంటిది సినిమా సెట్లలో అయితే ఇక హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, 'ఉడ్తా పంజాబ్' సినిమాలో ఆలియాభట్ నటిస్తుంటే.. అసలు ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదట, కనీసం దగ్గరకు కూడా రాలేదట. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా వెల్లడించింది. ఈ సినిమాలో ఆమె బిహార్ నుంచి వచ్చిన వలసకూలీ పాత్ర పోషిస్తోంది. అది బాగా డీగ్లామరైజ్డ్ పాత్ర కావడంతో.. షూటింగు మొదలవగానే తాను వచ్చినా కూడా ఎవరూ తనను గుర్తుపట్టలేదని, దర్శకుడు అభిషేక్ చౌబేతో తాను మాట్లాడుతుంటే అప్పుడు మాటను బట్టి గమనించి అంతా నాలుగు అడుగులు వెనక్కి వెళ్లారని చెప్పింది.

ఈ విషయాలను ఆమె ఆ సినిమాలోని 'ఇక్ కుడీ' పాట ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది. అమిత్ త్రివేదీ ట్యూన్లు అందించిన ఈ పాట స్లోగా సాగే పంజాబీ గీతం. ఇది ప్రేక్షకుల హృదయాలను నేరుగా తాకుతుంది. హాకీ ప్లేయర్ కావాలని ఆశపడే ఆలియాభట్.. తన టాలెంట్ చూపించడానికి చాలా కష్టపడుతుండటాన్ని ఈ పాటలో చూపిస్తారు. ఈ సినిమాలో ఇంకా షాహిద్ కపూర్, దిల్జీత్ దోసంజ్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఫాంటమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది.