సాక్షి, చెన్నై : వాహ్ తాజ్.. హుజూర్. ఏమిటీ టీపొడి యాడ్ గుర్తుకొస్తుందా! అయితే ప్రస్తుతం ఈ ప్రస్తావనకు కారణం మాత్రం నటి కాజల్ అగర్వాల్. తనూ ఇదే భావనను వ్యక్తం చేసింది. ఈ అమ్మడిప్పుడు చాలా ఉల్లాసంగా గడుపుతోంది. ఉత్సాహంగా ఉరకలేస్తోంది. అంతా సక్సెస్ మహిమ అంటారా? కావచ్చు. ఆ మధ్య వరుసగా అపజయాలను ఎదుర్కొని నిరుత్సాహపడిన చందమామకు...ఇటీవల కోలీవుడ్లో జయం రవితో జత కట్టిన కోమాలి చిత్ర విజయం నూతనోత్సాహానిచ్చింది. అంతేకాదు విశ్వనటుడు కమలహాసన్ సరసన ఇండియన్-2 చిత్రంలో నటించే అవకాశం వరించడం ఆమె ఆనందానికి మరో కారణం. ఇవన్నీ పక్కన పెడితే ఈ బ్యూటీ మానసికోల్లాసానికి మరో కారణం ఉంది. అదే ప్రేమకు చిహ్నం అయిన తాజ్మహల్. కాజల్ అగర్వాల్ ఇటీవల ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించింది. తాజ్మహల్ అందాలను చాలా దగ్గరగా చూడడంతో పరమానందభరితమైపోయిందట.
ఈ విషయాన్ని..అక్కడ తను తీసుకున్న ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. ‘తాజ్మహల్ను చూసి మైమరచిపోయాను. మైకం కమ్మినంత పని అయ్యింది. ఆ అద్భుతాన్ని తిలకించి భ్రమించిపోయాను. తాజ్మహాల్ వశీకరణ అందాల గురించి ఇది వరకే విన్నాను. ఇప్పుడు ఆ కట్టడాలను, లోపలి విషయాలు, సమాధి, దాని చరిత్ర నన్ను గతంలోకి తీసుకెళ్లాయి. ఇది నా జీవతంలో మరచిపోలేని అనుభవం’ అని కాజల్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు నటించిన.. ‘ప్యారిస్ ప్యారిస్’ (బాలీవుడ్ క్వీన్ రీమేక్)సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది హిందీ చిత్రం క్వీన్కు రీమేక్ అన్నది తెలిసిన సంగతే. కాగా ప్రస్తుతం కమలహాసన్తో ఇండియన్-2లో రొమాన్స్ చేస్తున్న కాజల్కు మరోసారి సూర్యతో జతకట్టే అవకాశం రాబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే ఈ అమ్మడు సూర్యతో ‘మాట్రాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.