ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తూ.. తాను ఏదో ఒక మూసలో ఇరుక్కుపోనని చెప్పే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు ఇప్పుడో విచిత్రమైన ఆఫర్ వచ్చింది. గతంలో క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి.. ఇప్పుడు శేఖర్ కపూర్ తన తాజా చిత్రంలో 85 ఏళ్ల వృద్ధురాలి పాత్ర ఆఫర్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా కంగనాయే 17వ జియో మామి ముంబై ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా వెల్లడించింది. అయితే ఇది ఇంకా ఖరారు కాలేదని, ఇంకా చర్చల స్థాయిలోనే ఉందని తెలిపింది.
ఈ పాత్ర తనకు ఓ సవాలు లాంటిదని చెప్పింది. కానీ శేఖర్ కపూర్ ఎన్నాళ్ల నుంచో కలలుగంటున్న 'పానీ' సినిమాలోనిదా.. కాదా అన్న విషయం వెల్లడించలేదు. ఫిలిం ఫెస్టివల్లో భాగంగా 'సినిమాల్లో మహిళలు' అనే అంశంపై జరిగిన సదస్సులో కంగనా పాల్గొంది. ఆమెతో పాటు షబానా అజ్మీ, విద్యా బాలన్, కిరణ్ రావు, అవా దేవునరీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. నటీమణులు ఎప్పుడూ ఒకేలా కనిపించాలన్న ఒత్తిడి అటు పరిశ్రమతో పాటు ఇటు సమాజంలో కూడా ఉందని.. అయితే తాము ఎలా ఉంటామో అలాగే ఉండాలన్న విషయాన్ని మహిళలందరూ ఆమోదించాల్సిందేనని కంగనా చెప్పింది.