కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?

24 Jan, 2017 10:27 IST|Sakshi
టీవీ టాక్ షోలలో కపిల్ శర్మ పేరు దేశంలో మార్మోగిపోతుంటుంది. సినిమా సెలబ్రిటీలను పిలవడం, త్వరలో విడుదల కాబోతున్న వాళ్ల సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆగకుండా గంట పాటు విపరీతంగా నవ్వించే కపిల్ షో అంటే చాలామందికి క్రేజ్. హీరోయిన్లను తనదైన శైలిలో ఆరాధించే కపిల్ చేష్టలు చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. అలాంటి షోకు ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా.. సాక్షాత్తు జాకీ చాన్!! 
 
అవును.. ఇప్పటికే షారుక్, సల్మాన్ సహా పెద్ద పెద్ద స్టార్లందరినీ తన షోలోకి తీసుకొచ్చిన కపిల్ శర్మ ఇప్పుడు రాబోతున్న అతిథి గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు. తాను నటించిన సినిమా 'కుంగ్‌ఫూ యోగా' ప్రమోషన్ కోసం జాకీ చాన్ ఈ షోకు రావాలని నిర్ణయించుకున్నాడట. ఆ విషయాన్ని కపిల్ ట్వీట్ చేశాడు. 'ఓ మై గాడ్.. కపిల్ షోలో జాకీచాన్' అని ఒక్క లైన్ మాత్రమే పెట్టాడు. కుంగ్‌ఫూ యోగా సినిమాలో బాలీవుడ్ నటీ నటులు దిశాపటానీ, సోనూ సూద్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో జాకీచాన్‌ది ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్ర.