రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

15 Aug, 2019 08:40 IST|Sakshi

ఆశ పడటంలో తప్పు లేదు. అయితే అది నెరవేరకపోతేనే నిరాశ కలుగుతుంది. నటి రష్మిక మందన్న ప్రస్తుతం ఇలాంటి నిరాశకు గురైందని సమాచారం. మాతృభాష కన్నడలో కూడా లేనంత క్రేజ్‌ను తెలుగు సినీ పరిశ్రమ తెచ్చి పెట్టింది. తెలుగులో ‘గీత గోవిందం’ సంచలన విజయంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయింది రష్మిక. ఆ తర్వాత మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’లో నానితో జత కట్టింది. ఆ చిత్రం ఓకే అనిపించింది. ఇక రెండోసారి విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం విడుదలకు ముందు పెద్ద హైప్‌ను క్రియేట్‌ చేసినప్పటికీ హిట్‌ రేంజ్‌కు చేరలేదన్నది ట్రేడ్‌ వర్గాల మాట. అయితే అంతకు ముందు ఉన్న క్రేజ్‌తో మహేశ్‌బాబుతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో కలిసి భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది.

ఇకపోతే తమిళంలోనూ ‘గీత గోవిందం’ తెచ్చి పెట్టిన పాపులారిటీతోనే కార్తీతో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కాగా అంతకు ముందే విజయ్‌ సరసన నటించే అవకాశం ఈ అమ్మడి కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.  దీంతో ఆగండయ్యా ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు అంటూ చిరు కోపంతో వారిని కట్డడి చేసింది.  దీంతో విజయ్‌కు జంటగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు రష్మిక మీడియాకు వెల్లడించింది. అలాంటిది విజయ్‌ 64వ చిత్రంలో నటి కియారా అద్వానీ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో హిట్స్‌ను అందుకుంటున్న కియారా ప్రస్తుతం బిజీగానే ఉంది.

దీంతో నటి రష్మిక విజయ్‌తో నటించే అవకాశం తనకే వస్తుందనే ఆశలు పెట్టుకుంది. అలాంటిది తాజాగా నటి కియారా తన కాల్‌షీట్స్‌ను సర్దుబాటు చేసుకుని విజయ్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రష్మిక ఆశ నిరాశగా మిగిలిపోయిందని బాధపడుతోందట. ప్రస్తుతం విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార నాయకి. తదుపరి భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో తన 64వ చిత్రంతో విజయ్‌ నటించనున్నారు.

మరిన్ని వార్తలు