నా టార్గెట్‌ వారే

1 Aug, 2018 02:45 IST|Sakshi
లక్ష్మణ్‌ కార్య

‘‘నాది తిరుపతి. ఓంకార్‌గారి ‘జీనియస్‌’ షోకి నా స్నేహితుడు శ్రీహరి ఎంపికయ్యాడు. నేను కూడా తనతో పాటు హైదరాబాద్‌ వచ్చా. నేను చేసిన షార్ట్‌ ఫిలింస్‌ చూసి నన్ను కూడా ఎంపిక చేసుకోవడంతో ‘జీనియస్‌’ షోకి పని చేశా’’ అని డైరెక్టర్‌ లక్ష్మణ్‌ కార్య అన్నారు. సుమంత్‌ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్‌’. యూవీ క్రియేషన్స్, పాకెట్‌ సినిమా నిర్మించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ కార్య మాట్లాడుతూ– ‘‘మొగుడు’ సినిమాకు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో, దేవా కట్టాగారి దగ్గర ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా.

‘హ్యాపి వెడ్డింగ్‌’కి ముందు ‘ఎందుకిలా’ వెబ్‌ సిరీస్‌ చేశా. ఆ సమయంలో సుమంత్‌ అశ్విన్‌గారితో ఏర్పడిన పరిచయంతో ‘హ్యాపి వెడ్డింగ్‌’ సెట్‌ అయింది. ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులను టార్గెట్‌ చేసి ‘హ్యాపి వెడ్డింగ్‌’ చేశా. వారి నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం సంతోషంగా ఉంది. తొలి నరేషన్‌లోనే నిహారిక ఇందులో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమా విడుదల తర్వాత నాగబాబుగారు ఫోన్‌ చేసి అభినందించడం వెరీ హ్యాపీ. నా తర్వాతి చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. 

మరిన్ని వార్తలు