ఇడ్లీలమ్మిన మోహన్ బాబు

24 Mar, 2016 12:23 IST|Sakshi

టాలీవుడ్లో మోనార్క్గా పేరున్న మోహన్ బాబు.. రోడ్డు పక్కన ఇడ్లీలమ్ముతూ కనిపించారు. 500 పైగా సినిమాల్లో నటించిన స్టార్,  భారీ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు ఉన్న మోహన్ బాబు ఇడ్లీలమ్మటం ఏంటి అనుకుంటున్నారా..? తన కూతురు మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం ఈ పని చేశారు కలెక్షన్ కింగ్. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మి, అలా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

ఓ ప్రైవేట్ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ తమవంతు సాయం అందించారు. రకుల్ ప్రీత్ సింగ్ మార్కెట్లో కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తాడు. అక్కినేని నటవారసుడు అఖిల్ ఆటో నడిపాడు. సీనియర్ హీరోయిన్ శ్రియ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేసింది. తాజాగా మోహన్ బాబు ఇడ్లీలు అమ్మి తన కూతురికి సాయం చేశారు. భవిష్యత్తులో మరింత మంది స్టార్స్తో ఈ తరహా పనులు చేయించాలని భావిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు.