వివాదాస్పద చిత్రానికి 100 కోట్లు

26 Sep, 2015 11:52 IST|Sakshi
వివాదాస్పద చిత్రానికి 100 కోట్లు

జాతీయ స్థాయిలో అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న ఎమ్ఎస్జి 2 మెసెంజర్ ఆఫ్ గాడ్ మరోసారి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా క్వాలిటీ పరంగా కన్నా, వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందింది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఎమ్ఎస్జి మెసెంజర్ ఆఫ్ గాడ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా, కలెక్షన్ల పరంగా మాత్రం ఆకట్టుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లతో ఎమ్ఎస్జి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అదే జోష్లో మరో సినిమాను తెరకెక్కించిన గుర్మీత్ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. సినిమా విడుదలపై ఎన్నో వివాదాలు తలెత్తటంతో ఫ్రీగా పబ్లిసిటీ సాధించిన ఎమ్ఎస్జి 2 మెసెంజర్ ఆఫ్ గాడ్ మరోసారి మ్యాజిక్ ను రిపీట్ చేసింది. సీక్వెల్ కూడా వంద కోట్లు వసూలు చేసినట్టుగా చిత్ర నిర్మాతలు హకికాట్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్లలో రిలీజ్ అయిన ఎమ్ఎస్జి 2 మెసెంజర్ ఆఫ్ గాడ్ క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతోంది.