‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

25 Nov, 2019 19:02 IST|Sakshi

బుల్లితెరపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న షో ‘జబర్ధస్త్‌’. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ షో నుంచి నాగబాబు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు వచ్చినట్టు తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా నాగబాబు ఇదివరకే వెల్లడించారు. తాజాగా జబర్దస్త్‌లో తన జర్నీకి సంబంధించిన మరో వీడియోను ఆయన సోమవారం విడుదల చేశారు. అలాగే మరిన్ని వీడియోలను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అసలు జబర్దస్త్‌ ఇన్ని రోజులు చేయాల్సింది కాదని తెలిపిన నాగబాబు.. ఆ షోకు సంబంధించిన పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. 

‘తొలుత నేను అదుర్స్‌ ప్రోగామ్‌ చేశాను. అక్కడ మేనేజర్‌ ఏడుకొండలుతో మంచి ర్యాపో ఏర్పడింది. నేను మల్లెమాలలోకి రావడానికి అతనే ముఖ్య కారణం. ఆ తర్వాతే నేను శ్యాంప్రసాద్‌రెడ్డికి ఫోన్‌ చేశాను. అదుర్స్‌ తరువాత నన్ను జబర్దస్త్‌ షోకు జడ్డీగా అడిగారు. తొలుత 25 ఎపిసోడ్స్‌ అని మాత్రమే చెప్పారు. అయితే ఆ జర్నీ ఇంతకాలం కొనసాగుతోందని ఎవరు అనుకోలేదు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఇది క్రియేటివ్‌ ఫీల్డ్‌ కావడంతో.. నేను, రోజా మంచి అండర్‌స్టాండింగ్‌తో కలిసి పనిచేశాం. 

తొలుత నేను 25 ఎపిసోడ్లు అనుకుని వచ్చాను. అయితే అదుర్స్‌తో పోలిస్తే.. రెండు వారాల్లోనే జబర్దస్త్‌కు అద్భుతమైన టీఆర్‌పీలు వచ్చాయి. శ్యాంప్రసాద్‌రెడ్డి కుమార్తె దీప్తికి ఈ షో భారీ విజయం సాధిస్తుందని చెప్పాను. అప్పటి నుంచి ఈ షో అలా కొనసాగుతూనే ఉంది. నేను ఆపేసిన అది కొనసాగుతుంది. జబర్దస్త్‌లో తొలుత చేసిన టీమ్‌ లీడర్లు అందరు నాతో చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల ట్యాలెంట్‌ చూసి నేను షాక్‌ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లు షో నుంచి వెళ్లిపోయారు. అయితే వాళ్ల టీమ్‌ల్లో చేసిన వాళ్ల నుంచే.. కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. అలా టీమ్‌ల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ షో ముందుకు సాగింది.   

జబర్దస్త్‌ ట్యాలెంట్‌ అనేది సంవత్సరాల పాటు చేసిన కృషి. ఇందులో చాలా మందికి భాగముంది. తొలుత ఈ కాన్సెప్ట్‌ చెప్పింది సంజీవ్. ఆయన చెప్పింది కూడా 25 ఎపిసోడ్లు మాత్రమేనని. సంజీవ్‌ క్రియేటివ్‌ మైండ్‌..  అతని దగ్గర నితిన్‌, భరత్‌ పనిచేసేవాళ్లు. వాళ్లు ఒక్కోసారి సంజీవ్‌ లేకపోయినా.. షోని వాళ్ల భుజాలపైన వేసుకోని నడిపించారు. అలా నితిన్‌, భరత్‌ వచ్చారు. తర్వాత సంతోష్‌ అనే అతను కూడా వచ్చాడు. అలాగే యాంకర్‌గా అనసూయ కొన్ని కారణాల వల్ల దూరం కావడంతో.. రష్మి జబర్దస్త్‌లో వచ్చింద’ని నాగబాబు తెలిపారు. జబర్దస్త్‌లో తన అనుభవాలకు సంబంధించిన ఇంకో వీడియోను రేపు పోస్ట్‌ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రచ్చ రవికి జరిగిన యాక్సిడెంట్‌ను ప్రస్తావించనున్నారు.

మరిన్ని వార్తలు