ఏడేళ్లలో అందనిది ‘7 నాట్కలిల్‌’తో అందుతుంది

24 Apr, 2017 02:53 IST|Sakshi
ఏడేళ్లలో అందనిది ‘7 నాట్కలిల్‌’తో అందుతుంది

ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన భారత సుందరి నికీషాపటేల్‌కు దక్షిణ సినిమాపై మక్కువ ఎక్కువే. దీంతో పలు ప్రయత్నాలనంతరం ‘పులి’ చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన అమ్మడు అక్కడ నరసిమ్మా, ఓం 3డీ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత కన్నడ సినిమాపై కన్నేసి కొన్ని చిత్రాల్లో నటించింది. అనంతరం ‘ఎన్నమో ఏదో’ తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో కాలుమోపింది. ఆ తర్వాత తలైవన్, కరైయోరం, నారదన్‌ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 2010లో సినిమాలకు పరిచయమైన నికిషా గత ఏడేళ్ల కాలంలో 13 చిత్రాల్లో మాత్రమే నటించింది.

అయితే వీటిలో కూడా ఏ ఒక్కటీ ఆమెకు గుర్తింపు తెచ్చేంతటి విజయాన్ని అందించలేకపోయాయి. అయినప్పటికీ పట్టువీడక ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది నికీషా. ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో పి.వాసు కుమారుడు శక్తి వాసు సరసన ‘7 నాట్కల్‌’ (ఏడు రోజులు) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎంఎస్‌ బాబు స్క్రీన్‌ప్లే చేస్తున్నారు.  మిలియన్‌ డాలర్స్‌ సినీ నిర్మాణ సంస్థ తరఫున కె.కార్తిక్, కె.కార్తికేయన్‌ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. వి.ఆర్‌.గౌతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికీషాది చాలా ముఖ్యమైన పాత్ర అట అని కోలీవుడ్‌ టాక్‌  ఏడేళ్ల కాలంలో అందని విజయం ‘7 నాట్కలిల్‌’ చిత్రం ద్వారా లభిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది నికీషాపటేల్‌.