విక్రమ్‌ప్రభుతో మరోసారి..

20 Jan, 2017 03:48 IST|Sakshi
విక్రమ్‌ప్రభుతో మరోసారి..

యువ నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్  చేయడానికి నటి నిక్కీగల్రాణి సై అన్నారు. చేతినిండా చిత్రాలన్న యువ నటీమణుల్లో నిక్కీగల్రాణి ఒకరు. యాగవరాయనుం నాకాక్క చిత్రం ద్వారా కోలీవుడ్‌ చిత్రంలో నటించడానికి ఎంపికైన ఈ ఉత్తరాది భామ తొలుత తెరపైకి కనిపించింది మాత్రం డార్లింగ్‌ చిత్రంతోనే. జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని చవి చూడడంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ, నెరుప్పుడా, కీ, మరగద నాణయం, హరహర మహాదేవిక  చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణికి తాజాగా మరో అవకాశం వచ్చింది.

నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభుతో జత కడుతున్న ఈ అమ్మడు అదే హీరోతో మరో చిత్రంలో రొమాన్స్  చేయడానికి సిద్ధం అవుతున్నారు. నవ దర్శకుడు సూర్య మెగాఫోన్  పట్టనున్న ఈ చిత్రానికి పక్కా అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇది నిక్కీగల్రాణికి 25వ చిత్రం అవుతుంది. ఇందులో ఆ బ్యూటీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు వీరాభిమానిగా నటించనున్నారట. పక్కా చిత్రం పూర్తి ఎంటర్‌టెయిన్ మెంట్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనుందని సమాచారం. నెరుప్పుడా, పక్కా చిత్రాల్లో నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్  చేస్తున్నారన్న మాట నిక్కీగల్రాణి. ఇక విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం క్షత్రియన్  త్వరలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం.