సరైన సినిమాలు చేయలేకపోయా, ఆ బాధతోనే ఇప్పుడు సక్సెస్‌ కొట్టా..

14 Oct, 2023 09:41 IST|Sakshi

నటుడు విక్రమ్‌ ప్రభు, విదార్థ్‌, శ్రీ శ్రద్ధా శ్రీనాథ్‌, సానియా అయ్యప్పన్‌, అపర్నిధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. ఎస్సార్‌ ప్రభు తన పొటాన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించాడు. యువరాజ్‌ దయాల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం గోకుల్‌, సంగీతాన్ని జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థాంక్స్‌ గివింగ్‌ మీట్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విక్రమ్‌ ప్రభు మాట్లాడుతూ.. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఇళ్లల్లో తాత శివాజీ గణేషన్‌ ఫోటో ఉంటుందన్నారు. ఈ ఇరుగప్పట్రు చిత్రం కూడా అలా ప్రతి ఇంటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కొన్ని సరైన చిత్రాలు ఇవ్వలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశానని.. ఆ విచారమే ఈ చిత్ర విజయానికి కారణమని పేర్కొన్నారు.

దర్శకుడు యువరాజ్‌ దయాళన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలైన అక్టోబర్‌ 6న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. నిర్మాత ఎస్సార్‌ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సంఘటన జరిగిందన్నారు. సాధారణంగా భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు బాగా ఆడతాయా, ఆడవా అని ఆలోచించకుండా చేస్తామన్నారు. అయితే ఎవరైనా కులచిత్రాలను నిర్మిస్తున్నట్లు తర్వాత చెబితే బాగా ఆలోచించి నిర్మించండి అని చెప్తానన్నారు. దాంతో చాలామంది తనపై ఆగ్రహించుకునేవారని చెప్పారు.

అదేవిధంగా కరోనా కాలం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని, మంచి కథా చిత్రాలను యువత చూడడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కథ, కథనాలతో రూపొందిస్తే చిన్న బడ్జెట్‌ చిత్రాలు కూడా సక్సెస్‌ అవుతాయని తమ ఇరుగప్పట్రు చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు.

చదవండి: 'లియో' బుకింగ్‌ స్టార్ట్‌.. వార్నింగ్‌ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

మరిన్ని వార్తలు